Sushil Kumarతో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్.. షాకింగ్ విషయాలు వెలుగులోకి

https://ift.tt/3vlTXcw
యువ రెజ్లర్ మర్డర్ కేసులో అరెస్టయిన భారత సీనియర్ రెజ్లర్ సుశీల్ కుమార్‌‌‌తో పోలీసులు క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేపట్టగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 4న ఢిల్లీలోని ఛత్రశాల స్టేడియం ఆవరణంలో 23 ఏళ్ల సాగర్‌పై తన స్నేహితులతో కలిసి విచక్షణారహితంగా దాడి చేశాడు. దాంతో.. తీవ్రంగా గాయపడిన సాగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఆ వెంటనే సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతని కోసం దాదాపు రెండు వారాలకి పైగా గాలించిన పోలీసులు ఎట్టకేలకి మీరట్‌లో గత ఆదివారం అరెస్ట్ చేశారు. సుశీల్ కుమార్‌ని కోర్టులో పోలీసులు హాజరుపరచగా.. అతనికి ఆరు రోజుల రిమాండ్ పడింది. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న సుశీల్ కుమార్‌‌ని సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జైల్లో అతను నేలపైనే పడుకున్నాడని.. ఖైదీలు తినే భోజనాన్ని అతనూ తిన్నాడని తెలిసింది. మంగళవారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సుశీల్ కుమార్‌ని ఛత్రశాల స్టేడియానికి తీసుకెళ్లారు. అక్కడ నేరం జరిగిన తీరుని రీకన్‌స్ట్రక్ చేసిన పోలీసులు.. సాగర్‌పై దాడి చేసిన తర్వాత ఛత్రశాల స్టేడియంలోని సీసీ టీవీ ఫుటేజీని సుశీల్ కుమార్ డిలీట్ చేయించినట్లు గుర్తించారు. క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్ తర్వాత పోలీసులు మరోసారి సుశీల్ కుమార్‌పై విచారణని చేపట్టినట్లు తెలుస్తోంది. సాగర్‌పై ఎందుకు దాడి చేశావు..? దాడి తర్వాత పారిపోయేందుకు ఎవరు సహకరించారు..? ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు..? స్టేడియంలోని సీసీ టీవీ ఫుటేజీలను ఎందుకు డిలీట్ చేశావు..? తదితర ప్రశ్నల్ని మరోసారి సుశీల్‌ని పోలీసులు అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. సుశీల్ కుమార్ అరెస్ట్ అయ్యే ముందు అతను వాడుతున్న స్కూటీ ఓ మహిళా రెజ్లర్‌‌ది‌గా తేలింది. అంతక ముందు రోజు రాత్రి ఆమె ఇంట్లోనే సుశీల్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రెజ్లర్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడిగా సుశీల్ కుమార్ అరెస్టవడంతో.. అతనిపై రైల్వే బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. ఉత్తర రైల్వేలో సుశీల్ పనిచేస్తున్నాడు.


CreditsKabaddi News, Football, Tennis, Hockey News, Badminton, More Sports News in Telugu

Comments